'వాసు'తో "కాసేపు"

'వాసు'తో  "కాసేపు"
***************

                              ఫేస్బుక్కు సంభాషణలలో అనుకోకుండా ఒకసారి ’వాసు’ అనే కవి గురించి చదవటం జరిగింది.ఆ తర్వాత నేను అతని కవిత్వం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నంలో  "న్యాయపతి శ్రీనివాస రావు గారు ’వాసు’ అనే కలం పేరుతో సుమారు ఒక దశాబ్ధం క్రితం "కాసేపు" పేరుతో ఒక కవితా సంకలనాన్ని వెలువరించినట్లు తెలుసుకుని ’వాసు’ గారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

 ఎలాగైనా "కాసేపు" ని చదవాలనే నాకోరికను ఒకానొక సంభాషణల సందర్భములో వెలిబుచ్చడం, ఆయన వెనువెంటనే నాకు ఒక కాపీని ఎంతో అభిమానంతో పంపించడం జరిగింది..ఆ పుస్తకం ఎపుడెపుడు చదువుదామా అనే ఆత్రంలో ఉన్న నేను మా ఇంటికి వచ్చాక కూడా ఒక నాలుగు రోజులవరకు కనీసం పుస్తకాన్ని చూడలేకపోవడం నాలో ఆసక్తిని మరింత పెంచింది...ఇక ’కాసేపు" నాచేతికొచ్చాక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా అక్షరంమక్షరం ఆబగా చదువుకున్నా.

                 గురుతుల్యులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడి గారి ’కానీ జ్వరమూ తరచుగా రాదు’ మరియు శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు గారి ’పరిమళించిన నిశ్శబ్ధం’ వాసు గారి చాలా గాఢమైన భావాల అనుసృజనని అర్థం చేసుకోవడంలో ఒక దిక్సూచిలా దిశానిర్దేశం చేస్తాయి.ఇక కవితల విషయానికొస్తే మొదటి కవిత ’జననం’ లో ’తొలి కదలిక కోసం నా నిరీక్షణ\ నిశీధికి నవ్వించే కవ్వింపై పోయింది’ లాంటి వాక్యాలు... అలాగే ’జిరాఫీ మెడలో కొండ చిలువ వొళ్ళు విరుచుకున్నప్పుడు" వంటి నూతన వాక్యప్రయోగాలు తన కవితలు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పారు.ఇక ’ సంప్రదాయానికి నమస్కారం’ కవితలో "కాలం ముందుకే పోతుంది\మనసు వెనక్కి కూడా పోగలదు" అంటూ తన బాల్య స్మృతుల్ని మన ముందు ఆవిష్కరిస్తారు.’పూజగదిలో దీపం వెలుగు పువ్వులు తెమ్మని బయటికి తరిమేది’, ’సైనికుల్లా బారులు తీరి తోటల్లో\తుపాకీ పేలుస్తే పువ్వులు రాలేవి\కన్నీళ్ళు పోస్తే నక్షత్రాలు మొలిచేవి’ అంటూ తనకుర్ర చేష్టల్ని ఎంతో అందంగా మన ముందుంచుతారు.

                 ’ఎర్ర గన్నేరు’ కవితలో ’కొమ్మల్లో నెత్తుటి వేగాన్ని గ్రహించీ\రాత్రి కొత్తగా వచ్చిన పువ్వుల్ని తాకీ’ అంటూ ఆచెట్టు తో తనకు పెనవేసుకుపోయిన బంధాన్ని గుర్తుచేసుకుంటారు. అలాగే కవి చెట్టుతో తదాత్మ్యం చెంది ’నాకూ చెట్టుకూ పెద్ద తేడా ఏముంది?\పండిన ఆకుల ముడతలతో\పువ్వుల కవళికలతో\నాకు చెట్టు అద్దం పడుతుంది’అని అంటారు కవి..ఇంకా ’చెట్టులో మనిషికోసం ఎలిజీనీ\చెట్టులో ’లోర్కా’నీ చూడనప్పుడు\చెట్టు జడపదార్థమే’అని తీర్మానిస్తారు.

                ’ది రూమ్’ అనే కవితలో కవి తనవాళ్ళని విడిచిపెట్టి ఒంటరిగా రూమ్ లో ఉండవలసివచ్చినపుడు తను మొదట్లో ఎలా నిర్వేదనకు గురైనదీ ఎంతో హృద్యంగా చెప్పారు.అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అలవాటు చేసుకున్నాక ’చెప్పానుగా నేనీ రూమ్ లో\ఆత్మనిగ్రహం సాధించానని\నేను ఈ రూమ్ ఆత్మని\ఈ రూమ్ నా శరీరం’అని కవి వెల్లడిస్తారు.అలాగే ఈ కవితలో కూడా’పుట్టు మచ్చ లోంచీ\వెంట్రుక బైటపడుతున్నట్టుంటుంది ’అనే విలక్షణమైన ప్రతీకలు ఉన్నాయి.

                ’కూల్ డ్రింక్ పార్లర్’లో ఒక బాల కార్మికుని జీవితంలోని విషాదాన్ని ’మంచు’ని ప్రతీకగా చేసి ఎంతో ఆర్ధ్రతతో చెప్పారు. అనునిత్యం ఉరుకులు పరుగులతో సాగే జీవితంలో ఒక సారి కాసింత  జ్వరం వచ్చి పక్కమీద వాలినపుడు కవి ఒక్కసారి ఆగి తన జీవితాన్ని ఎలా పరికించారో ’జ్వరం వచ్చినపుడు’ కవితలో వర్ణిస్తారు. ’శరీరంలోకి ప్రవేశించిన అతిథిని\ఆప్యాయంగా ఇముడ్చుకుని\ఓ క్షణం కల్లుమూసి తెరిస్తే’ అంటూ కవిత సాగుతుంది. ’జలపాతం దగ్గర’ కవితలో కవి చాలా నూతన ప్రతీకల్ని ప్రయోగించారు. ’నురగల గోళీలు’ అలాగే జలపాతాన్ని "బ్రహ్మాండమైన నూడుల్స్’ గాను వర్ణించడం చాలా అబ్బురపరుస్తుంది.నేడు అంతర్జాల ప్రవేశంతో పూర్తిగా మరుగున పడిపోయిన ఉత్తరాలని తన "ఉత్తరాలు’ అనే కవితలో ’ ఉత్తరాలు\సుదూర స్నేహ వృక్షాల మీంచి\వీచే ప్రాణ వాయువులు’ అంటూ పాత గ్యాపకాల్ని కదిలిస్తారు.

                 ’రేసు గుర్రం’ కవితలో మనిషిని రేసు గుర్రంతో పోల్చుతారు. ఈ కవితలో ’ ఇప్పుడీ గుర్రం గమ్యం చేరుకుంది’,’శరీరాన్ని వేగం చేసుకునే\రోమన్ బానిస\పనిగంటల్ని పూర్తిచేసుకుంది’ అంటూ మనయొక్క బ్రతుకు రేసుని పోల్చుతారు. అలుందాగే పనిలోనే జీవితం గడిచిపోయిన మనల్ని ’నెడితేనే తప్ప\కదలని గాడిదై పోయిందిప్పుడు’ అంటూ చురకవేస్తారు కవి.

                   ఇపుడు ఖచ్చితంగా చెప్పగలను ' రాశి కంటే వాసి మిన్న' అని.. మామూలుగా చదివితే సాధారణ వచన కవితాల్లానే ఉన్నా దానిలోని నిగూఢంగా దాగున్న అంతరార్థాల్నీ, మర్మాన్ని తరచి చూస్తే అపుడు ఆ కవితలోని ప్రతి అక్షరం లోనూ ఆత్మ కనిపిస్తుంది..

                           నేను వంద కవితలున్న సంపుటిని చదివినపుడు కూడా కలగనంత అనుభూతిని పొందాను..ప్రతి కవిత చాలా సాధారణమైన పదాలతో ప్రారంభమైనా కవితలో ముందుకు సాగుతున్న కొలదీ అనేకానేక నూతన పద బంధాలూ, వాక్యప్రయోగాలతో ఒక ప్రయోగశాలని తలపించింది...సాధారణంగా నాకు ఒక కవితలో ఒకటో రెండో పదాబంధాల ప్రయోగమో లేక వాక్యాలో నచ్చుతాయి. అలాంటిది వాసు గారి ప్రతి కవిత నుండి కూడా కోట్ చేయగలిగినవి లెక్కకు మిక్కిలి ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు.. వాసు గారూ... ఇంతమంచి కవితా సంపుటిని అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు...

-ఫణీంద్ర కుప్పిలి
  09.08.2016

పాప్యులర్ పోస్టు

ఎన్ని'కల' భోజనంబు | ఫణీంద్ర కుప్పిలి

(అ)పుత్రస్య గతిర్నాస్తి..

మొబైలోపాఖ్యానం